మొత్తం 245 స్థానాలు గల రాజ్యసభలో ఈఏడాది ఏప్రిల్ నాటికి 55 స్థానాలు ఖాళీ కానున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలే ఉన్నాయి. దీంతో రాజ్యసభలో 15 స్థానాలకు పైగా ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఓటమి చెందిన ముఖ్య నేతలతో పాటు ప్రియాంకను కూడా ఎగువ సభకు పంపాలనే డిమాండ్ ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. లోక్సభలో రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రియాంక పార్టీని ముందుండి నడిపిస్తారని, ఆ బాధ్యతలు వారికి అప్పగిస్తే బాగుంటుందని పార్టీలోని ఓ వర్గం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం 82 ఉంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఎగువ సభలో బీజేపీకి తగిన సంఖ్యా బలం లేదు. దీంతో బిల్లులను ఆమోదించుకోవడం వంటి సందర్భాల్లో ఇబ్బంది ఎదుర్కొంటోంది. ఇకపై విపక్షాల బలం తగ్గనుండడంతో ఎన్డీయేకు ఈ సారి బలం పెరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్లో 1, ఉత్తర్ప్రదేశ్లో 10 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సైతం అభ్యర్థులను గెలిపించుకుని బలం పెంచుకోనుంది. ప్రస్తుతం కాంగ్రెస్కు 46 మంది సభ్యులున్నారు. తాజాగా జరిగే ఎన్నికల్లో కొన్ని సిట్టింగ్ స్థానాలను హస్తం పార్టీ కోల్పోనుంది.